ఇంద్రధనస్సు
వర్షం కురిసిన తరువాత సూర్యునికి ఎదురుదిశలో సప్తవర్ణాలతో వినువీధిలో మనోహర దృశ్యంగా హరివిల్లును 🌈మనం తరుచుగా చూస్తాం. సూర్యకాంతి వాన చినుకులలో ప్రసరించి, విశ్లేషణ చెందడంతో ఇంద్రధనస్సు వెల్లివిరుస్తుంది.
సూర్యకిరణాలలో వుండే ఈ సప్తవర్ణాల నుంచే పుష్పాలు 💐, ఓషధులు ప్రత్యేకించి తమకు కావలసిన రంగులను స్వీకరించి వివిధ వర్ణాలతో , ఆకృతులతో, సొగసులతో 🏜️ వృద్ధి చెందుతు ప్రకృతికి శోభ, అందాలను సమకూరుస్తూ మన మనస్సులను ఆహ్లాదభరితం చేస్తాయి. ఈ సప్తవర్ణాలకు మూలం వక్రీభవనం చెందిన సూర్యకాంతికిరణ విశ్లేషణనే!!
మొహ, కాంక్ష, పరిగ్రహ రహిత జీవాత్మ మోక్షం అనే దివ్యధామం చేరుకోవడానికి ముక్తిధనస్సు అనే పద్దెనిమిది రకాల యోగాలను మానవాళికి మార్గ నిర్దేశనంగా అందించిన అపూర్వ జ్ఞానగీతిక, భగవద్గీత. నీవు ఏ యోగమార్గంలో ఏ దిశ నుంచి పయనించిన అవి నిన్ను లక్ష్యం 🎯 వైపుకు మాత్రమే నడిపిస్తాయి.
ఈ పద్దెనిమిది యోగ మార్గాలను స్థూలంగా కర్మ యోగం, భక్తి యోగం, జ్ఞాన యోగలుగా పరిగణిస్తారు.
కర్తృత్వభావనను వదలివేసి జనకళ్యాణం, లోకహితం,సమాజశ్రేయస్సును మాత్రమే కాంక్షిస్తూ కర్మలను ఆచరించాలి అని కర్మయోగం ప్రబోధిస్తుంది.
అటువంటి కర్మ యోగి ప్రతి పనిని దైవం కోసమే చేస్తున్నాను, దైవానికే చేస్తున్నాను అనే భావనతో ఆచరిస్తూ కర్మ ప్రతిఫలాలను అంకితభావంతో, అనన్యభక్తి శ్రద్ధలతో పరమాత్మకు సమర్పించడమే భక్తియోగం.
అటువంటి నిత్యయుక్తుడు మధుసూదనుడు, అవ్యయుడు, అప్రమేయుడి కరుణ, కృపలతో బుద్ధియోగంలో ప్రవేశించి తన లోని అజ్ఞానాంధకారాలను జ్ఞానజ్యోతులతో తొలగించుకుంటూ జ్ఞానప్రకాశంతో నివృత్తి మార్గంలో గానీ లేదా ప్రవృత్తి మార్గంలో ఆత్మ స్వరూపజ్ఞానం లోనికి ప్రవేశిస్తాడు.
పరమాత్మ ప్రసాదిత అపురూప మానవ జీవిత పరమార్థం జన్మరాహిత్యం. జన్మరాహిత్యం ద్వారా జీవాత్మ పరంధాముడి దివ్యధామం చేరుకోవడమే మోక్షం. ఇది దుఃఖరాహిత్యం, సంసారబంధన, భవబంధన విముక్తులతో సాధ్యం!!
దుఃఖానికి మూలం శరీరం. ఈ శరీరానికి మూలం కర్మలు. కర్మలకు మూలం రాగద్వేషాలు. వీటికి మూలం అజ్ఞానం. ఈ అజ్ఞానానికి మూలం కారుమబ్బులు సూర్యుడిని కప్పివేసినట్లుగా, జ్ఞానం అహంతో కప్పివేయడం.
అజ్ఞానం సస్వరూపాన్ని మరగుపరచడంతో జీవుడు సంసారబంధనం, భవబంధనాలలో బంధిగా ఉంటూ ఈ దేహం నాది, నేనే ఈ దేహం అనే మాయలో జీవనయానం కొనసాగిస్తుంటాడు.
సృష్టిలో దేహలన్నీ పుట్టుక, పసిప్రాయం, బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, దేహాంతరప్రాప్తితో కాలంలో కలిసి నశించే దేహమే జీవుడికి క్షేత్రం. జీవాత్మనే సచ్చిదానంద స్వరూపం అయిన క్షేత్రజ్ఞుడు. దేహమే క్షేత్రంగా ఉపస్థితుడు. ఆత్మ మార్పు లేనిది శాశ్వతమైనది, నిత్యమైనది. శరీరం నశిస్తుంది కాని ఆత్మ నశించదు. ఆత్మ చైతన్యభరితం. మనసు, బుద్ధి పనిచేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. దేహక్షేత్రంలో ఒక సాక్షి లాంటిది. మన జీవితంలో జరిగే సుఖదుఃఖాలను కేవలం గమనిస్తుంది తప్ప, వాటితో ప్రభావితం కాదు.
ఆత్మ, అనాత్మ, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు,దృశ్యం,దృక్కు అన్ని ఈ దృశ్యప్రపంచంలో ఏకమై అజ్ఞానికి ఒకటిగా కనిపిస్తాయి. కంటికి కనిపించే ప్రతి పదార్థం నశిస్తుంది, ఇంద్రియానుభూతికి అతీతమైన చైతన్యమును చైతన్యముగా గుర్తించి ఆత్మ యందు చిత్తంను, అనాత్మ (క్షేత్రం) యందు విరక్తిని కలిగి తత్వదర్శి జీవనపయనం కొనసాగిస్తాడు.
అహం పరిపూర్ణంగా త్యజించి పరమాత్మ శరణు కోరితే అజ్ఞానం అనే మేఘాలు తొలగి జ్ఞానం అంతరంగంలో వికసిస్తుంది. దుఃఖరాహిత్యం వికసిత జ్ఞానంద్వారానే సిద్ధిస్తుంది!!
పతంజలి మహర్షి ముక్తిధామ సాధన కోసం అష్టాంగయోగ ప్రణాళికను మానవాళికి అపురూప పురస్కారంగా బహూకరించాడు. అవి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము,ధారణ,ధ్యానము,సమాధి.
- యమము: అహింస, సత్యము, అస్తేయం, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనే పంచ గుణాత్మకం.
- ధర్మపరిరక్షణలో జరిగే హింసను అహింసగానే పరిగణించడం.
- ‘సత్యం వద,ధర్మం చర ‘ అంటే సత్యంనే పలకడం,ధర్మంనే ఆచరించడం.
- అస్తేయము అంటే ఇతరుల సమ్మతి లేకుండా వారి వస్తువులను, ప్రతిభను వాడుకోకపోవడము.
- బ్రహ్మచర్యము అంటే దైవం నిర్దేశించిన జ్ఞానమార్గంలో నడవడం.
- అపరిగ్రహము అంటే అవసరానికి మించి దేనిని ఆశించకపోవడం.
- నియమము: శౌచము,సంతోషము,తపస్సు,స్వాధ్యాయము,ఈశ్వరప్రణిధానము అనే పంచగుణసమ్మేళనం.
- శౌచము అంటే నడతలో, నడకలో, మనస్సులో,ఆలోచనలలో స్వచ్ఛత, పవిత్రత, పారదర్శకత కలిగివుండడం.
- సంతోషము అంటే లభించిన వాటితో ఆనందం,తృప్తిని కలిగివుండడం.
- తపస్సు అంటే లక్ష్యసాధన కోసం ఆత్మనిగ్రహంతో, అంకితభావంతో చేసే ధ్యానం.
- స్వాధ్యాయము అంటే ఆత్మపరిశీలనతో ఆలోచనలను విశ్లేషించుకోవడము.
- ఈశ్వరప్రణిధానము అంటే కర్మఫలత్యాగంతో అహం వదిలి పరమాత్మ శరణుకోరుకోవడం
- ఆసనము: ధ్యానసాధన కోసం స్థిరమైన, సౌకర్యవంతమైన శారీరక భంగిమ లేదా కూర్చునే స్థానం
- ప్రాణాయామము: శ్వాసక్రియలో పూరకం,కుంభకం మరియు రేచక క్రియలతో ప్రాణశక్తిని విస్తరింపచేసి జీవశక్తిని పెంపొందించుకోవడం.
- ప్రత్యాహారము: మనస్సుద్వారా ఇంద్రియాలను నిగ్రహించి యోగి అంతర్ముఖంగా చేసే ధ్యానం.
- ధారణ: మనస్సును ఏకాగ్రతతో నిలిపి ఉంచడం
- ధ్యానము: శ్వాసపై ధ్యాస ద్వారా మనస్సుకు ప్రశాంతతను తీసుకురావడం.
- సమాధి: విషయ విస్మరణ, ఆత్మస్మరణ. అందుకు దుస్సంకల్పములను మదిలో నుంచి వేరుచేయాలి, సత్సంకల్పములకు మనస్సు వేదిక కావాలి. విషయ విస్మరణతో నిస్సంకల్పస్థితికి చేరుకోవాలి, అదే సమాధిస్థితి.
ఈ జీవిత పరమార్థం జన్మరాహిత్యంద్వారా మోక్షధామం చేరుకోవడమే!!
మనం చేసే ప్రతి పని, ఆలోచన కర్మ బంధనానికి మూలం అవుతుంది.
కర్మ యోగి చేసే ప్రతి పని, ఆలోచనలను పరమాత్మకు సమర్పణ చేస్తాడు, అందువలన ఆ కర్మఫలాలు అతనిని బంధించవు, వాటినుంచి విముక్తుడిని చేస్తాయి. అష్టాంగయోగం ఆ కర్మ యోగిలో విషయ విస్మరణతో తత్వదర్శిగా ఈ జీవితకాలంలోనే జీవన్ముక్తుడిగా పరబ్రహ్మ దివ్యసన్నిధికి చేరుస్తుంది.
మొహం, క్రోధం,లోభం అనే మాయతో సమ్మోహన భరితమైన మనస్సు గమ్యం తెలియని పతనదిశలో వడివడిగా అడుగులు వేస్తూ ఆత్మని అధోగతిపాలు చేసే ప్రమాదం ఉంది, కాని ఆత్మసంయమనంతో శరీరం, ఇంద్రియములు, మనస్సు, బుద్ధిని తన వశంలో ఉంచుకోవడం ద్వారా మనస్సు లక్ష్యపథంలో కార్యోన్ముక్తుడిని చేస్తుంది.
అటువంటి కర్మయోగి మనోనిగ్రహంతో అనన్య చింతన, అనన్య భక్తి ప్రవృత్తిలతో పరమాత్మ అనుగ్రహం కోసం పరితపిస్తూ పరమాత్మను భక్తి, శ్రద్ధలతో సేవిస్తూ ఉంటాడు.
అది ఆ తత్త్వదర్శికి ముక్తిమార్గం అవగతం చేస్తూ అటు వైపుకు నడిపిస్తుంది.
అదేవిధంగా జీవించి ఉన్నపుడే ముక్తి పొందినవాడు జీవన్ముక్తుడు. కర్మలు జరుగుతాయి కానీ అతనికి ఆ కర్మలతో బంధనం ఉండదు. తామరాకు మీద నీటి బిందువులా ప్రపంచంలో వుంటాడు కానీ ప్రపంచ బంధనాలతో అంటుకోడు.
ఈ దేహమే క్షేత్రం, ఆత్మనే క్షేత్రజ్ఞుడు అని అర్థం చేసుకున్న కర్మయోగి కర్మలను వదలివేయడు చేసే ప్రతి పనిని నేను చేస్తున్నాను అనే కర్తృత్వభావనను వదలివేసి పరోపకారం, లోకహితం, సమాజశ్రేయస్సును మాత్రమే కాంక్షిస్తూ కర్మలను ప్రతిఫలాపేక్ష రహితంగా ఆచరించడం ద్వారా అవి నిష్కామ కర్మలు అవుతాయి. నిష్కామ కర్మలు యజ్ఞక్రియలుగా పరివర్తనం చెందుతాయి.
యజ్ఞక్రియలు జీవాత్మను కర్మబంధనాలలో బంధించవు.
సర్వేజనా సుఖినోభవంతు
మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
నారాయణ శెట్టి రాచపూడి
వ్యవస్థాపకులు
రానా యోగ ఆలయ
9900022729
🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️
#divineguidance #yogameditation
#yogalifestyle
#yogainspiration #yogamitra